Reading Time: < 1 minute
Former Mp Kusuma Krishnamurthy Passes Away Andhra Pradesh

Kusuma Krishnamurthy: తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబీకులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. కృష్ణమూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

READ MORE: Dhurandhar: హృతిక్ వ్యాఖ్యలపై దర్శకుడు స్పందన.. ‘ధురంధర్ పార్ట్‌ 2’పై క్లారిటీ ఇచ్చిన ఆదిత్య ధర్

కుసుమ కృష్ణమూర్తి 1940 సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అయినవిల్లి మండలం విలస గ్రామంలో జన్మించారు. శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చదివి ఎంఏ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవుల్లో పనిచేశారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కుసుమ కృష్ణమూర్తి మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 6వ లోక్‌సభ (1977–1979), 7వ లోక్‌సభ (1980–1984), 9వ లోక్‌సభ (1989–1991)లకు ప్రాతినిధ్యం వహించారు. ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించిన ఆయన ఉత్తమ ఎంపీగా కూడా మంచి గుర్తింపు పొందారు. నవంబర్ 1983 నుంచి జనవరి 1985 వరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 1990లో పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు. 1980 నుంచి 1982 వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై సంయుక్త సెలెక్ట్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. దళితుల సమస్యలపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది.

READ MORE: Harish Rao: ఫుడ్‌ పాయిజన్‌తో ఆసుపత్రి పాలైన 90 మంది విద్యార్థులు.. పరామర్శించిన హరీష్‌రావు..