
US-Iran War: ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల దాటింది. ఇప్పటికీ పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు, అమెరికా దాడుల్ని ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమై ఉన్న యూఎస్ బలగాలు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ‘‘భూతల దాడులకు’’ సిద్ధమవుతోంది. ఇరాన్లో వారాల తరబడి భూతల దాడులు నిర్వహించేందుకు పెంటగాన్ సిద్ధమవుతోందని వాషింగ్టన్ పోస్ట్ శనివారం నివేదించింది. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సాధారణ పదాది దళాలు ఇందులో భాగంగా ఉండచ్చని తెలుస్తోంది. అయితే, ఈ ప్రణాళికకు ట్రంప్ ఆమోదం తెలుపుతారా.? లేదా? అనేది ఇంకా సస్పెన్స్గా మారింది. భూతల దాడులు పూర్తిస్థాయి ఇరాన్ ఆక్రమణగా మారదని నివేదిక పేర్కొంది.
Read Also: Korukonda Crime: కిలాడి లేడీ.. ఇన్సూరెన్స్ కోసం క్రైమ్ డ్రామా, చివరలో ట్విస్ట్!
ముఖ్యంగా, ఇరాన్ ఆయువుపట్టుగా ఉన్న ‘‘ఖార్గ్ ద్వీపాన్ని’’ స్వాధీనం చేసుకునే దిశగా భూతల దాడులు ఉండే అవకాశం ఉంది. ఇరాన్ అతిపెద్ద చమురు టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో 90 శాతం ఖార్గ్ ఐలాండ్ నుంచే జరుగుతున్నాయి. ఇదే కాకుండా, అంతర్జాతీయ నౌకయానానికి హార్ముజ్ జలసంధిలో అడ్డుగా ఇరాన్ కోస్టల్ ఇన్స్టాలేషన్లను ధ్వంసం చేయాలనేది అమెరికా ప్లాన్. ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియాన్ని స్వాధీనం చేసుకునే దిశగా భూతలదాడులు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే వేల సంఖ్యలో యూఎస్ మెరైన్స్, 82న ఎయిర్బోర్న్ డివిజన్ బలగాలను ఇప్పటికే మధ్యప్రాచ్యంలో మోహరించాయి. అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెప్పరని, యుద్ధం ఆపకపోతే నరకాన్ని చూపిస్తారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివీట్ హెచ్చరించారు. అయితే, అమెరికా అనుకున్నంత ఈజీగా ఈ ఆపరేషన్ సాగకపోవచ్చు. ఇరాన్ మెయిన్ ల్యాండ్ నుంచి 25 కి.మీ దూరంలో ఖార్గ్ ద్వీపం ఉంటుంది. ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ సైన్యం ఎదురుదాడికి దిగే ప్రమాదం ఉంది. ఖార్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవడం సులభమే అయినప్పటికీ, యూఎస్ తన సైన్యాన్ని రక్షించుకోవడం సవాలుతో కూడుకున్నదిగా మారుతుంది.