Reading Time: 2 minutes
Padi Kaushik Reddy Assembly Controversy Ethics Committee Telangana

తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. సభలో నిబంధనలను ఉల్లంఘిస్తూ, సీనియర్ సభ్యులను అవమానించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ , సభలో ఆయన అనుసరించిన తీరుపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ (Ethics Committee) విచారణకు సిఫారసు చేసింది.

Aamir Khan: ‘నేను సినిమాలు చూడను’.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్..

అసెంబ్లీలో మైనింగ్ అక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తన అత్యుత్సాహంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో, కౌశిక్ రెడ్డి తన చేతులతో తుపాకితో కాల్చేస్తున్నట్లు సైగలు చేస్తూ, అసభ్యకరమైన సంజ్ఞలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సభలో పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గరికి రావడం, సభలో గందరగోళం సృష్టించడం ద్వారా సభా సంప్రదాయాలను కాలరాస్తున్నారని, అతని దూకుడుకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం భావించింది.

MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..

కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ దళిత , గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. కడియం శ్రీహరి వంటి 40 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నేతను చంపుతామన్నట్లుగా సంజ్ఞలు చేయడం “గుండాగిరి” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , ఎమ్మెల్యే వేముల వీరేశం ధ్వజమెత్తారు. గతంలో కేవలం నిరసన తెలిపినందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

మొదట కౌశిక్ రెడ్డిని సభ నుంచి శాశ్వతంగా తొలగించాలని భావించినప్పటికీ, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఎథిక్స్ కమిటీని కోరారు. కౌశిక్ రెడ్డికి సంబంధించిన వీడియోలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది , వాటిని కమిటీకి అందజేయనుంది. ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయించనుంది.