Reading Time: < 1 minute
East Godavari Woman Fakes Gold Theft For Insurance Claim Police Expose Crime Drama

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఓ మహిళ వేసిన ప్లాన్ చివరకు ఆమెనే ఉచ్చులో పడేసింది. బంగారం దొంగతనం జరిగిందని కట్టు కథ అల్లుతూ పోలీసులను మోసం చేయాలని ప్రయత్నించిన ‘కిలాడి లేడీ’.. చివరకు విచారణలో దొరికిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాజమండ్రి నార్త్ డీఎస్పీ సుభాష్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

కోరుకొండలో ఒంటరిగా నివాసం ఉంటున్న ముండ్రు పద్మ (56) తాను కొనుగోలు చేసిన 200 గ్రాముల బంగారానికి ముందుగానే ఇన్సూరెన్స్ చేయించింది. ఆ తర్వాత ఇదే బంగారం దొంగతనానికి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానాలు తలెత్తాయి. బాధితురాలు చెప్పిన వివరాలు, ఇక్కడి ఆధారాలు ఒక్కటిగా సరిపోకపోవడంతో కేసు మలుపు తిరిగింది. దీంతో పోలీసులు ఆమెను లోతుగా విచారించగా.. అసలు నాటకం బయటపడింది.

Also Read: TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!

ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందేందుకు తానే కథ సృష్టించి.. దొంగతనం జరిగినట్టు చిత్రీకరించానని ముండ్రు పద్మ ఒప్పేసుకుంది. కోరుకొండ నార్త్ డీఎస్పీ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పిల్లలు ఉద్యోగం రీత్యా లండన్లో ఉండడంతో.. పద్మ ఒంటరిగా నివాసం ఉంటుంది. పద్మపై గతంలో ఇంట్లో పని చేసే మహిళలపై దాడి చేసినట్లుగా కేసులు ఉన్నట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.