Reading Time: < 1 minute
Nepal Pm Balen Shah Govt Jobs Gen Z Movement Martyrs Families

Balen Shah: నేపాల్ నూతన ప్రధానమంత్రి బాలెన్ షా తనదైన శైలిలో పాలన సాగిస్తూ మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన ‘జెన్ జీ’ (Gen Z) ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 27 మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని ఆయన నిలబెట్టుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో గత ఏడాది సెప్టెంబర్ 8న జరిగిన నిరసన ప్రదర్శనల్లో పోలీసుల కాల్పుల కారణంగా మొదటి రోజే 19 మంది విద్యార్థులు మరణించగా, చికిత్స పొందుతూ మరో 8 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో, బాలెన్ షా ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించింది.

READ ALSO: RBI Plan: రూపాయి విలువ పెంచేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. ఇక దూసుకుపోవడమే..

అమల్లోకి వచ్చిన నిర్ణయం..
ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే అమలు ప్రక్రియ కూడా వేగవంతమైంది. నేపాల్ ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ’ అధికారిక నోటీసు జారీ చేసింది. మరణించిన 27 మంది విద్యార్థుల సమీప బంధువుల జాబితాను ప్రకటించారు. వారి విద్యార్హత, సామర్థ్యాన్ని బట్టి వారి సొంత జిల్లాల్లోనే ఉద్యోగాలు కల్పించనున్నారు. నియామకం పొందే అభ్యర్థులు 35 రోజుల్లోగా తమ బంధుత్వ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.

మాట నిలబెట్టుకున్న బాలెన్ షా
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అధికారంలోకి రాగానే అమలు చేసి బాలెన్ షా తన రాజకీయ చిత్తశుద్ధిని చాటుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ వంటి కఠిన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఆయన, మరోవైపు బాధితుల పట్ల మానవీయ కోణంలో స్పందించడం నేపాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, విద్యార్థుల మరణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

READ ALSO: Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2!