Reading Time: < 1 minute
Women Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు మరో గుడ్ న్యూస్.. చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డులు.. అప్పటినుంచే..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఈ పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిన మహిళల రవాణా ఛార్జీల మొత్తం నేటితో రూ. 10 వేల కోట్ల మార్కును చేరుకుని అరుదైన రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని TGSRTC అధికారికంగా ప్రకటించింది. 2023 డిసెంబర్ 9న పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. అనంతరం 2026, మార్చి 29 నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశారు. దీంతో ఈ పథకం కోసం రూ. 10,000 కోట్లు ఖర్చు చేసినట్లయింది.

పెరిగిన మహిళా ప్రయాణికులు

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. గతంలో 40 శాతంగా ఉండగా.. ఇప్పుడు 67 శాతానికిపైగా పలికింది. ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికిపైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తుండగా.. వీటి టిక్కెట్ల విలువను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీకి చెల్లిస్తోంది. దీని వల్ల ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతుంది. రూ.10 వేల కోట్లకు చేరుకోవడంపై రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ పథకంతో మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందికి పొన్నం ప్రభాకర్ తన అభినందనలు తెలియజేశారు.

త్వరలో చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డులు

ఉపాధి అవకాశాల కోసం మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక గ్రామాల నుండి నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాదుకు వస్తున్నారు. ఇక కుటుంబంతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నారు. అటు త్వరలో మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్‌ కార్డులు ద్వారా మహిళల ఉచిత ప్రయాణం చేసేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడనుందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతోందని ఎండీ స్ఫష్టం చేశారు.