
గత నెల రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో హల్చల్ సృష్టించిన పెద్దపులి కథ చివరకు సుఖాంతమైంది. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం, గంగవరం, గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల వరకు తిరుగుతూ పశువులపై దాడులు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులి.. ఇప్పుడు మళ్లీ తన అసలు నిలయం అయిన పాపికొండల అభయారణ్యానికి చేరుకుంది. ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పులి పూర్తిగా అడవిలోకి వెళ్లిపోయిందని అధికారులు స్పష్టం చేశారు.
ఇంతకుముందు పట్టుబడిన పులిని విశాఖకు తరలించి.. అక్కడి నుంచి దేవీపట్నం మండలం కొండమొదలు సమీపంలోని అడవుల్లో వదిలారు. కానీ కొన్ని రోజులకే దారి తప్పి మళ్లీ జనావాసాల వైపు వచ్చేసింది. తాజాగా ప్రత్తిపాడు మండలంలోకి చేరిన పులి ఒకే రాత్రిలో నాలుగు పశువులను హతమార్చి మరింత భయాన్ని సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు టెక్నాలజీ సహాయంతో పులి కదలికలను ట్రాక్ చేశారు.
Also Read: RCB vs SRH: చిన్నస్వామిలో చరిత్ర.. ఆర్సీబీ vs ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు రికార్డు వ్యూస్!
కొత్తవీధి నుంచి దండంగి మార్గంగా ప్రయాణించిన పులి చివరికి తిరిగి దేవీపట్నం మండలం వైపు అడవుల్లోకి చేరి.. పాపికొండల అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. దాదాపు నెల రోజుల పాటు నిరంతరం పర్యవేక్షణ చేపట్టిన అటవీశాఖ సిబ్బంది.. ఇప్పుడు పులి అడవిలోకి వెళ్లిపోవడంతో రిలాక్స్ అయ్యారు. గ్రామాల ప్రజలు కూడా భయాందోళనల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు.