Reading Time: 2 minutes
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని ప్రాశస్త్యాన్ని చాటిచెబుతున్న టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి
వారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడంతో టీటీడీ పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

ఈ మేరకు నిధులు కేటాయించడంతోపాటు పనులను వేగవంతం చేసే ప్రణాళికకు కసరత్తు ప్రారంభించింది. తమిళనాడులోని ప్రముఖ రియల్టర్ సంస్థ కోయంబత్తూరులో ఆలయ నిర్మాణానికి 19.62 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందు కొచ్చింది. ఈ ప్రతిపాదనను టీటీడీ మండలి ఆమోదించింది. త్వరలోనే ఆ భూమిని టిటిడి రిజిస్ట్రేషన్ చేసు కుని ఆలయాన్ని నిర్మించబోతోంది.

ఇక అస్సాంలోని కామరూప్ జిల్లా పన్ బారీ మౌజీ, అమెరిగోగ్ గ్రామంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 10.32 ఎకరాలను రూ. 28,09,800లకు అక్కడి ప్రభుత్వం టీటీడీకి విక్రయించింది. టీటీడీ సొంత నిధులు, లేదంటే దాతల విరాళాలతో ఆలయాన్ని నిర్మించాలనుకుంటోంది.

ఇక నవీ ముంబయిలోని ఉల్వేలో దాదాపు 10 ఎకరాల్లో రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల విరాళంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా పనులు పూర్తి కాగా జూన్ లో ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి ఆలయంలో నెలకొల్పే మూలమూర్తులకు 3 కిలోల బంగారంతో కవచాలను తయారు చేసేందుకు టీటీడీ ఆమోదించింది.

ఇక కర్ణాటకలోని బెలగావిలో బెలగావిరెడ్డి సంఘం ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది. బెలగావి జిల్లా కోలికొప్ప గ్రామంలో 7 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ భూమిని తన పేరున టీటీడీ రిజిస్ట్రేషన్ చేసుకొని శ్రీవాణి నిధులతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించనుంది.

అన్ని రాష్ట్రాల సీఎంలకు టీటీడీ లేఖలు..

మరోవైపు అన్ని రాష్ట్రాలకు శ్రీవారి ఆలయ నిర్మాణాల కోసం స్థలాలు కేటాయించాలని టీడీడీ లేఖలు రాసింది. ఆ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని కోరింది. ఆయా రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందించి భూములు ఇచ్చేందుకు ముందుకు రాగా సంబంధించిన ప్రతిపాదనలను
టీటీడీ బోర్డు సైతం ఆమోదించింది. ఇక ఇప్పటికే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బీహార్ ప్రభుత్వానికి రాసిన లేఖతో అక్కడి ప్రభుత్వం స్పందించింది.

ఆలయ నిర్మాణానికి నామ మాత్రపు లీజుతో భూమిని ఇవ్వడానికి అంగీకరించింది. పాట్నా జిల్లా మౌజా మోకమా ఖాస్, మోకమా నగరంలో 10.11 ఎకరాల భూమిని 99 సంవత్సరా లకు రూపాయి లీజుతో ఇచ్చేందుకు అంగీకరించింది. త్వరలోనే టిటిడి తిరుపతి ఎస్టేట్ విభాగం అధికారికంగా బిహార్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..