Reading Time: < 1 minute
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నందిగ్రామ్ ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లోని క్షేత్రస్థాయి కార్యకర్తలతో చర్చలు నిర్వహించిన ధర్మేంద్ర ప్రధాన్.. రాబోయే ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే.. నందిగ్రామ్‌లో మరోసారి
కమలం వికసించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మార్పుకు చేతన.. నందిగ్రామ్

ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రసంగంలో నందిగ్రామ్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నందిగ్రామ్ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం లేదా ఒక నియోజకవర్గం మాత్రమే కాదని, అది బెంగాల్ రాజకీయాల్లో మార్పుకు ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ పట్ల, రాష్ట్ర నాయకత్వం పట్ల నందిగ్రామ్ ప్రజలకు ఉన్న విశ్వాసం విడదీయలేనిదని, అది ఎప్పటికీ దృఢంగా ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సువేందు అధికారి సాధించిన విజయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తుండగా.. గెలుపు కోసం బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది.