Reading Time: < 1 minute
Mojtaba Khamenei New Message Sparks Speculation

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా బ్రతికే ఉన్నాడో లేదో తెలియదని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మయామిలోని ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్‌లో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో తాజాగా మోజ్తాబా నుంచి కొత్త సందేశం రావడం ఆసక్తి రేపుతోంది. ఈ సందేశంతో మోజ్తాబా బ్రతికే ఉన్నారన్న చర్చ నడుస్తోంది.

ఇరాన్ మీడియా ప్రకారం.. మోజ్తాబా తన సందేశంలో ఇరాన్ ప్రజలకు, మత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతున్న యుద్ధ సమయంలో దేశానికి మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రజలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందేశం ప్రముఖ షియా మత నాయకులతో జరిగిన సమావేశం తర్వాత లిఖిత సందేశం పంపినట్లుగా సమాచారం.

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఈ ఘటనలో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే కుమారుడు మోజ్తాబా కూడా గాయపడ్డారు. అయితే ఖమేనీ మృతి తర్వాత మోజ్తాబానే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. కానీ ఇప్పటి వరకు పబ్లిక్‌లోకి రాలేదు. దీంతో బ్రతికే ఉన్నాడా? లేదంటే చనిపోయాడా? అంటూ రకరకాలైన ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇరాన్ ప్రభుత్వ వర్గాలు, రాష్ట్ర టెలివిజన్ మాత్రం… వైమానిక దాడిలో గాయపడి కోలుకుంటున్నారని సూచించాయి. అయితే దీనిపై స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. కానీ మోజ్తాబా ఇప్పటివరకు కొన్ని లిఖిత ప్రకటనలు మాత్రమే విడుదల చేశారు. కానీ ఎలా ఉన్నారో మాత్రం హెల్త్ విషయాలు తెలియజేయలేదు.

పర్షియన్ నూతన సంవత్సరమైన నౌరూజ్ సందర్భంగా కూడా మోజ్తాబా సందేశం విడుదల చేశారు. ఆ సందేశంలో యుద్ధంలో విజయం సాధిస్తామని ధైర్యంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ.. అవి సుప్రీం లీడర్‌తో నేరుగా జరుగడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తంగా మోజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం, ఆయన ఆరోగ్యంపై స్పష్టత లేకపోవడం, అలాగే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి.

ఇది కూడా చదవండి: Rahul Banerjee: విషాదం.. యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత