
Nepal Education Revolution: నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో సంచలనం సృష్టించింది. విద్యను రాజకీయాల కోరల నుంచి విముక్తి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘100 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ను శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.
READ ALSO: Nara Lokesh: కార్యకర్తలే పార్టీ బలం.. టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!
రాజకీయ రహిత క్యాంపస్లే లక్ష్యం..
విద్యాసంస్థలు ఇకపై విజ్ఞాన కేంద్రాలుగా మాత్రమే విరాజిల్లాలని, రాజకీయ వేదికలుగా మారకూడదని బాలెన్ మంత్రివర్గం స్పష్టం చేసింది. ప్రధానంగా రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న విద్యార్థి సంఘాలను విద్యాసంస్థల నుంచి పూర్తిగా నిషేధించింది. రాబోయే 60 రోజుల్లోగా అటువంటి సంఘాల కార్యాలయాలను, నిర్మాణాలను విద్యా ప్రాంగణాల నుంచి తొలగించాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. పార్టీ రాజకీయాలకు బదులుగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ‘విద్యార్థి మండలి’ (వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్) వంటి రాజకీయేతర యంత్రాంగాలను 90 రోజుల్లోగా ఏర్పాటు చేయనున్నారు.
కార్యాచరణ ప్రణాళికలోని 5 కీలక అంశాలు ఇవే..
* విద్యార్థి రాజకీయాలపై నిషేధం: పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల కార్యకలాపాలపై తక్షణ నిషేధం విధించారు.
* విదేశీ పేర్ల తొలగింపు: ఆక్స్ఫర్డ్, పెంటగాన్, సెయింట్ జేవియర్స్ వంటి విదేశీ పేర్లతో కొనసాగుతున్న విద్యాసంస్థలు ఇకపై తమ పేర్లను ‘అసలైన నేపాలీ పేర్లు’గా మార్చుకోవాల్సి ఉంటుంది.
* పరీక్షలు లేని బాల్యం: 5వ తరగతి వరకు విద్యార్థులకు సాంప్రదాయ పరీక్షలను రద్దు చేశారు. వారి ప్రగతిని అంచనా వేయడానికి ‘ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానాన్ని’ అమలు చేస్తారు.
* పౌరసత్వ నిబంధన తొలగింపు: పట్టభద్రత కోసం నేపాల్ పౌరసత్వం తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేశారు. దీనివల్ల పత్రాల సమస్యతో ఏ విద్యార్థి చదువు ఆగిపోకుండా భరోసా కల్పించారు.
* సకాలంలో ఫలితాలు: రాజకీయ జోక్యం వల్ల పరీక్షల ఫలితాల్లో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టేందుకు, ఇకపై అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కచ్చితంగా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
విద్యా క్యాలెండర్ సక్రమంగా లేకపోవడం వల్ల వేలాది మంది నేపాలీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. బాలెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచి, విద్యార్థుల వలసలను తగ్గిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులతో నేపాల్ విద్యా రంగం కొత్త పుంతలు తొక్కనుందని చెబుతున్నారు.
READ ALSO: Korukonda Crime: కిలాడి లేడీ.. ఇన్సూరెన్స్ కోసం క్రైమ్ డ్రామా, చివరలో ట్విస్ట్!