Reading Time: 2 minutes
Cm Revanth Reddy Comments On Kcr Harish Rao Telangana Politics

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై స్పష్టతనిచ్చారు. అసెంబ్లీ వేదికగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పురాణాలను ఉదాహరణగా తీసుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రాజకీయాల్లో ప్రతిపక్షాల విమర్శలే తనను మరింత బలోపేతం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “రావణాసురుడు ఉండటం వల్లే శ్రీరాముడికి ప్రాధాన్యత దక్కింది.. శకుని లేకుంటే శ్రీకృష్ణుడికి అంత గుర్తింపు ఉండేదా?” అని ప్రశ్నిస్తూ, కేసీఆర్ ఉండటం వల్లే రేవంత్ రెడ్డికి ఈ స్థాయిలో పేరు వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలకు, చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదని, తాను మాత్రం చెప్పిందే చేస్తానని స్పష్టం చేశారు. హరీష్ రావు గురించి హెచ్చరిస్తూ, ఆయన “కాలనాగు కంటే ప్రమాదకరం” అని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు.

Live in Relationship: సహజీవనం చేస్తున్న జంటలకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

రైతుల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని సీఎం అన్నారు. “గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారు.. కానీ మా ప్రభుత్వం వరి వేసిన వారి దగ్గర ధాన్యం కొనడమే కాకుండా, సన్న బియ్యం పండించిన రైతులకు బోనస్ కూడా ఇస్తోంది” అని గుర్తు చేశారు. సన్న బియ్యం కోసం ప్రభుత్వం రూ. 14,560 కోట్లు ఖర్చు చేస్తోందని, పేదలందరికీ పథకాలు అందేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. కల్తీని నివారించడానికి హైడ్రా, పీడీ యాక్ట్ తరహాలో కఠిన చట్టాలను తీసుకువస్తామని ప్రకటించారు.

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే ఉత్తర భారత దేశానికే లబ్ధి చేకూరుతుందని, దీనివల్ల దక్షిణ భారత్‌కు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది పార్టీల సమస్య కాదు.. దక్షిణ భారత ప్రజల సమస్య. అన్యాయం జరుగుతుంటే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏం చేస్తున్నారో చెప్పాలి, ఆయన వెంటనే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. నార్త్-సౌత్ మధ్య అంతరం పెరగకూడదని, కానీ బాగా పనిచేస్తున్న దక్షిణ రాష్ట్రాలను శిక్షించడం సరికాదని హితవు పలికారు.

Live in Relationship: సహజీవనం చేస్తున్న జంటలకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడా బయట కనిపించకపోవడంపై రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ గృహ నిర్బంధంలో ఉన్నారేమోనని తనకు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన దిగ్విజయంగా సాగుతోందని, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వంటి పథకాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. మంచి పరిపాలన అందించడమే తన లక్ష్యమని, రేపటి నుంచి రెండు రోజుల పాటు కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.