Reading Time: < 1 minute
Mlc Anantababus Wife Lakshmi Durga Granted Bail In Driver Subrahmanyam Murder Case

Driver Subrahmanyam Case: రాజమండ్రి జిల్లా న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు జిల్లా సెషన్స్ కోర్టు ఊరట ఇచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేశారు. లక్ష్మీ దుర్గకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2 నిందితురాలిగా బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. అయితే, ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది.. రూ.50,000 చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని.. పాస్‌పోర్ట్ కోర్టుకు అప్పగించాలని.. దేశం విడిచి వెళ్లకూడదని.. కాకినాడలోనే నివసించాలని.. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల రక్షణపై కాకినాడ జిల్లా ఎస్పీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది కోర్టు..

Read Also: C. R. Patil : కాళేశ్వరంపై రాజ్యసభలో రచ్చ.. కేంద్ర జల శక్తి మంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఇక, లక్ష్మీ దుర్గకు విచారణకు సహకరించమని సూచించింది కోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును వేగంగా విచారించడం కోర్టు లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో లక్ష్మీ దుర్గను రెండో నిందితురాలిగా చేర్చారు. నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు అయినప్పటికీ, కేసు బలహీనపడినట్లు కాదు. బాధితుల తరఫున ముప్పాళ్ళ సుబ్బారావు వ్యాఖ్యానించారు: “నిందితులు తప్పించుకోలేరు, శిక్ష తప్పదు. నవంబర్ 30 వరకు కేసు విచారణ పూర్తయ్యి తీర్పు వెలువడుతుంది.”

అయితే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, నూకా రత్నం మరియు సత్యనారాయణ, తమ ఇంటి వద్ద కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల ఒక కారు ఢీకొన్న ఘటనలో గాయాలయినట్లు చెప్పారు. మరోవైపు.. పిట్టా వరప్రసాద్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు, కోర్టు తీర్పు సామాజికంగా తప్పుడు సంకేతాలు ఇస్తుందని విమర్శించారు. “చెక్ బౌన్స్ కేసులోనూ, ఇలాంటి నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు సమాజానికి దారుణ సంకేతాలను ఇస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు తర్వాత కేసు విచారణ వేగంగా సాగనుంది, బాధితుల రక్షణ మరియు న్యాయనిర్వహణ పై ముఖ్యమైన దృష్టి పెట్టబడింది.