Reading Time: 2 minutes

అమెరికాలో 67 మందిని బలితీసుకున్న విమాన ప్రమాదం కొత్త వీడియో వైరల్

Caption of Image.

ప్రమాదాలు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో ఎవరూ ఊహించలేరు. గతేడాది అమెరికాలోని వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన ఒక భయంకరమైన విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ’60 మినిట్స్’ విడుదల చేసిన ఈ కొత్త ఫుటేజీలో.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానం, యూఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాలిలో ఒకదానికొకటి ఢీకొన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రెండు విమానాలు ఢీకొన్న వెంటనే ఆకాశంలో మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్మేసింది.

గతేడాది జనవరి 29న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో విమానంలోని 64 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు హెలికాప్టర్‌లోని ముగ్గురు సైనికులు ఉన్నారు. కాన్సాస్ నుండి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342, పొటోమాక్ నదిపై కేవలం 400 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో.. శిక్షణలో ఉన్న బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను బలంగా ఢీకొట్టింది. 2001 తర్వాత అమెరికా గగనతలంలో జరిగిన అత్యంత ఘోరమైన మిడ్-ఎయిర్ కొలిజన్‌గా చరిత్రలో నిలిచిపోయింది.

ఈ విషాదం తర్వాత అమెరికా విమానయాన రంగంలో పెను మార్పులు వచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. విమానాశ్రయాల సమీపంలో హెలికాప్టర్ల రాకపోకలను నియంత్రించడంతో పాటు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఏకంగా 12 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.లక్షా 10వేల కోట్ల నిధులను అమెరికా ప్రభుత్వం కేటాయించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. విమాన ప్రయాణాల్లో భద్రత ఎంత కీలకమో మరోసారి గుర్తు చేస్తోంది. మెుత్తానికి పాత ప్రమాదానికి సంబంధించిన కొత్త ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

©️ VIL Media Pvt Ltd.