
హైదరాబాద్ నగరంలోని కీలకమైన ఇందిరా పార్కులో అక్రమ ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలపై హైడ్రా (HYDRAA) కఠిన చర్యలు చేపట్టింది. వాకర్స్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడటంలో జీహెచ్ఎంసీ విఫలమైన చోట హైడ్రా తనదైన శైలిలో స్పందించి పార్కు స్థలాన్ని పునరుద్ధరించింది.
ఇందిరా పార్కులో కొత్తగా స్కేటింగ్ రింగ్ను ఏర్పాటు చేయడంతో, పాత స్కేటింగ్ రింగ్ ఉన్న స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలాన్ని అదనుగా చూసుకున్న ఒక ప్రైవేట్ వ్యక్తి, ‘సమ్మర్ క్యాంప్’ పేరుతో అక్కడ కరాటే తరగతులు నిర్వహించడం ప్రారంభించారు. అయితే, ఆ స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమించాలనే ఉద్దేశంతో, నిబంధనలకు విరుద్ధంగా పార్కు ప్రహరీ గోడను కూల్చివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు.
Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!
నిర్వాహకులు ఏకంగా కరాటే శిక్షణ కోసం పర్మినెంట్ క్యాంప్ ఏర్పాటు చేస్తామంటూ, స్థానిక ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 30 లక్షలు కేటాయించాలని ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రభుత్వ అనుమతులు రాకముందే నిర్మాణ సామగ్రిని అక్కడ డంప్ చేసి, పార్కు గోడను ధ్వంసం చేయడం వాకర్స్ను విస్మయానికి గురిచేసింది.
ఈ అక్రమ కట్టడాలపై స్థానిక వాకర్స్ పలుమార్లు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో వారు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆశ్రయించారు. ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న కమిషనర్, పార్కును సందర్శించి అక్రమంగా చేపడుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను సూచించారు.
Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పార్కు గోడను కూల్చివేసిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా ఆదేశించింది. ఈ మేరకు అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అక్రమంగా చేరవేసిన నిర్మాణ సామగ్రిని కూడా అక్కడి నుండి తొలగించారు.
ప్రభుత్వ స్థలాలను, పార్కులను కబ్జా చేయాలని చూస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యంగా పబ్లిక్ పార్కుల్లో ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యం పెరగకుండా వాకర్స్ , స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. హైడ్రా తీసుకున్న ఈ తక్షణ చర్యపై ఇందిరా పార్క్ వాకర్స్ , పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.