
బెంగళూరు: ఆట నుంచి క్రమం తప్పకుండా తీసుకునే విరామాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాయని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. అలసటను దూరం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాయని చెప్పాడు.
‘గత 15 ఏళ్లుగా ఉన్న బిజీ షెడ్యూల్, నేను ఆడిన క్రికెట్ దృష్ట్యా నాకు అలసటగా అనిపించే ప్రమాదం ఉండేది. కానీ మధ్యలో విరామం తీసుకోవడం వల్ల చాలా ఉత్సాహంగా ఆడగలుగుతున్నా. ఇవి నాకు చాలా మేలు చేశాయి. నేను వంద శాతం ఫిట్గా ఉంటేనే గ్రౌండ్లోకి అడుగుపెడతా. పూర్తి సన్నద్ధత లేకుండా బరిలోకి దిగను. అదనపు విశ్రాంతి మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
జట్టులో స్థానం కోసం కాకుండా విజయాలు సాధించడం చాలా ముఖ్యమన్నాడు. ‘శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహం తోడైతే జట్టు విజయాల్లో భాగస్వామిని కావొచ్చు. ఆటగాడిగా అదే నా లక్ష్యం. కేవలం జట్టులో చోటు నిలబెట్టుకోవాలని నేను అనుకోను. నిరంతరం శ్రమిస్తూ జట్టు కోసం రాణించడమే ముఖ్యం’ అని విరాట్ స్పష్టం చేశాడు.