
- బండి సంజయ్ కుమార్
ముస్తాబాద్ /తంగళ్లపల్లి వెలుగు : దేశవ్యాప్తంగా ఏటా 125 రోజులపాటు పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలోని అంకిరెడ్డి పల్లె, ముస్తాబాద్ మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డి పల్లె లో రూ.25 లక్షలతో , ముస్తాబాద్ లో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రూ. 32 కోట్ల 13 లక్షలతో రోడ్లను నిర్మించినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు రూ. 700 కోట్ల నిధులను పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేశామన్నారు. ఉపాధి హామీ పథకానికి 60 శాతం నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తోందని, రాష్ట్రం కూడా 40 శాతం నిధులను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డవేని గోపి, ఆడెపు రవి,శీలం రాజు మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, సౌళ్ల క్రాంతి, మల్లారపు సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.