
Jewellery Missing: ఉత్తరప్రదేశ్ లోని బరాబంకి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇప్పుడు ఓ వివాదానికి దారి తీసింది. ఇసేపూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. అయితే పోస్ట్మార్టం అనంతరం మృతదేహాల నుంచి ఆభరణాలు మాయమైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఘటన కొత్త మలుపు తిరిగింది. మృతి చెందిన మహిళల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు చేసిన ప్రాథమిక పరిశీలనలో ఆభరణాల వివరాలు నమోదు చేసినట్లు వెల్లడించారు.
PSL 2026 Ball Tampering: పాకిస్థాన్ లీగ్లో బాల్ ట్యాంపరింగ్.. బజారున పీఎస్ఎల్ పరువు!
కానీ పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలను తీసుకునేందుకు వెళ్లినప్పుడు మహిళల శరీరాలపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదని వారి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై వారు కోతవాలి పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. ఈ ప్రమాదంలో దేవరాణి, జేఠాని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. మూడు సంవత్సరాల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతోంది. ఆదివారం రోజున మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతదేహాలు అందుకున్న తర్వాత కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. మహిళల చెవులకు ఉన్న జుమ్కీలు, మెడలో ఉన్న మంగళసూత్రం, చైన్ వంటి ఆభరణాలు కనిపించలేదని వారు అందించిన రిపోర్ట్ లో పేర్కొన్నారు. కేవలం ఒక మహిళ పాదాల్లో కాలి గొలుసు (గజ్జె) మాత్రమే మిగిలి ఉందని అన్నారు. మిగతా అన్ని ఆభరణాలు గల్లంతయ్యాయని వారు ఆరోపించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, దీనికి వెనుక ఏదైనా కుట్ర ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రమాదం సీతాపూర్ జిల్లాలోని మహ్ముదాబాద్ ప్రాంతానికి చెందిన ఇంద్రజీత్ వర్మ తన భార్య ఖుషీ వర్మ (18), వదిన పింకీ దేవి (28), మూడు సంవత్సరాల మేనకోడలితో కలిసి బైక్పై బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగింది. రైల్వే క్రాసింగ్ తెరుచుకున్న వెంటనే వేగంగా వచ్చిన ట్రక్ వారి బైక్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి పోస్ట్మార్టంలో పాల్గొన్న సిబ్బందిని విచారించి, ఆభరణాలు మాయమైన ఘటన వెనుక అసలు కారణాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.