Reading Time: < 1 minute
Up Woman Finds Rs 10 Crore In Her Bank Account Says Take It Back Know Details Here

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మైన్‌పురి జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆ కుటుంబానికి, తమ ఖాతాలో ఏకంగా రూ. 10 కోట్లు ఉండటంతో ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. బ్యాంకు సర్వర్‌లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఏటీఎం స్క్రీన్‌పై కోట్లాది రూపాయలు..

మైన్‌పురి జిల్లాలోని సుల్తాన్ గంజ్ ప్రాంతానికి చెందిన సీత అనే మహిళకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఆమె కుమారుడు అరుణ్ కుమార్ కొత్త ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేయడానికి బ్యాంకు ఏటీఎంకు వెళ్ళాడు. స్క్రీన్‌పై బ్యాలెన్స్ చూడగానే అతను అవాక్కయ్యాడు. అందులో అక్షరాలా రూ. 9,99,49,586 (దాదాపు 10 కోట్లు) ఉన్నట్లు చూపించింది. కళ్లని నమ్మలేక రెండు మూడు సార్లు రశీదులు తీసి చూసినా అదే మొత్తం కనిపించడంతో కంగారుగా ఇంటికి పరిగెత్తాడు.

నిజాయతీ చాటుకున్న రైతు కుటుంబం..

సాధారణంగా ఎవరైనా తమ ఖాతాలో అంత డబ్బు చూస్తే సంబరపడతారు. కానీ, వ్యవసాయంపై ఆధారపడి బతికే ఆ కుటుంబం మాత్రం భయపడింది. ‘ఆ డబ్బు ఎవరిదో మాకు తెలియదు. మా కష్టార్జితం కాని రూపాయి కూడా మాకు వద్దు. బ్యాంకు అధికారులు ఆ డబ్బును వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని సీత, ఆమె భర్త ఫర్జన్ స్పష్టం చేశారు. బ్యాంకు సెలవు ముగియగానే వెళ్లి ఆ మొత్తాన్ని అప్పగిస్తామని వారు ప్రకటించి తమ నిజాయతీని చాటుకున్నారు.

Also Read:Condoms Shortage: యుద్ధ ప్రభావం.. భారీగా ఏర్పడిన కండోమ్‌ల కొరత..

వైరల్ వీడియో.. బ్యాంకు వివరణ..

ఏటీఎం బ్యాలెన్స్ స్లిప్పులు, ఫొటోలు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై బ్యాంక్ ఆఫ్ ఇండియా సుల్తాన్‌గంజ్ బ్రాంచ్ అధికారులు స్పందిస్తూ.. ఇది కేవలం ‘టెక్నికల్ ఎర్రర్’ మాత్రమేనని తెలిపారు. సదరు మహిళకు బ్యాంకులో లోన్ అకౌంట్ ఉందని, సిస్టమ్ అప్‌డేట్ సమయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని వివరణ ఇచ్చారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు ఒక సామాన్యురాలి ఖాతాలోకి రావడం బ్యాంకింగ్ వ్యవస్థలోని భద్రతా లోపాలను వేలెత్తి చూపుతోంది.