Reading Time: 2 minutes
10th Class Evaluation 2026: పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ ఇదే.. ఫలితాలు ఎప్పుడంటే?

అమరావతి, మార్చి 30: రాష్ట్రంలో ఏప్రిల్ 2వ తేదీతో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం ఏప్రిల్ 6 నుంచే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు అన్ని సబ్జెక్టుల స్పాట్ వాల్యులేషన్‌ ముగించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాలలో ఏప్రిల్ 15తో మొత్తం 10 రోజుల పాటు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. మూల్యాంకనం ప్రక్రియలో కచ్చితత్వం, క్రమశిక్షణ ఉండేలా చూసేందుకు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్‌ రోజుకు 40 జవాబు పత్రాలు మాత్రమే దిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిలో 20 ఉదయం సెషన్‌లో, మరో 20 మధ్యాహ్నం సెషన్‌లో మూల్యాంకనం చేసేందుకు ఇస్తారు. మూల్యాంకనం సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినమైన శిక్షలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఎగ్జామినర్లు మార్కులను నమోదు చేయడానికి టాబ్‌ల వంటి డిజిటల్‌ సాధనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్, 10వ తరగతి పరీక్షలు రెండింటికీ ఈ విధానంలోనే మూల్యాంకనం చేయనున్నారు. మార్కుల లెక్కింపులో మానవ తప్పులను తొలగించడమే లక్ష్యంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత సిబ్బందికి మొదట వివరణ కోరుతూ నోటీసులు జారీ చేస్తారు. పాఠశాల విద్యా కమిషనర్, డైరెక్టర్‌కు వివరణాత్మక నివేదికలు సమర్పించాలి. వారి ప్రతిస్పందనల ఆధారంగా శాఖాపరమైన చర్యలు చేపడతారు. ఇందులో రూ. 6,000 వరకు జరిమానాలు, ఇంక్రిమెంట్ కోతలతో సహా తదుపరి చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా గత ఏడాది తలెత్తిన సమస్యల దృష్ట్యా కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, మార్కుల లెక్కింపులో వ్యత్యాసాలను నివారించడానికి ఎగ్జామినర్లు మార్కులను రియల్ టైమ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

మూల్యాంకనం అనంతరం మార్కుల నమోదు ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తి కానుంది. ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. గత సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 23న ప్రకటించబడ్డాయి. కాగా మార్చి 16న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పేపర్‌తో ముగియనున్నాయి. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.