
ముంబైలో భారీ LPG సిలిండర్ల దొంగతనం కలకలం రేపింది. ఒక డెలివరీ వాహనం నుంచి మొత్తం 27 గ్యాస్ సిలిండర్లను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా గ్యాస్ సరఫరాపై ఇప్పటికే ఆందోళనలు ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటన చార్కోప్ ప్రాంతంలోని కాకా కేని చౌక్ వద్ద చోటుచేసుకుంది. ఫిర్యాదు ప్రకారం డెలివరీ బాయ్ నందకుమార్ రామ్రాజ్ సోని మార్చి 25న ఎల్పీజీ సిలిండర్లతో నిండిన తన టెంపోను ఇంటి సమీపంలో పార్క్ చేశాడు.
మరుసటి రోజు తిరిగి వచ్చి చూడగా వాహనం డోర్ గ్లాస్ పగిలి ఉండటం, వెనుక లాక్ విరిగిపోయి ఉండటం గమనించాడు. వాహనంలో ఉన్న ఐదు నిండిన సిలిండర్లతో పాటు 22 ఖాళీ సిలిండర్లు కూడా కనిపించకుండా పోయాయి. మొత్తం 27 సిలిండర్లు దొంగిలించబడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం ఈ దొంగతనంలో పలువురు అనుమానితులు పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఘటనాస్థల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, కొన్ని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ ఘటనతో నగరంలో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సరఫరా వ్యవస్థకు సంబంధించిన వాహనాల భద్రతపై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి