
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో రికార్డు స్థాయిలో 1,44,251 కేసులు పరిష్కరించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన లోక్ అదాలత్ కంటే ఈసారి 37.14 శాతం ఎక్కువ కేసులు పరిష్కారమయ్యాయి. 39,069 కేసులు అదనంగా లోక్ అదాలత్లో సెటిల్ అయ్యాయి. సైబర్ నేరాల బారిన పడిన 4,635 మంది బాధితులకు రూ.24.95 కోట్ల నగదు రిఫండ్ చేసినట్లు సీఐబీ చీఫ్ చారుసిన్హా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు.
హైదరాబాద్ కమిషనరేట్లో 15,719 ..
21,388 రాజీ పడదగ్గ ఎఫ్ఐఆర్ కేసులు, 57,343 ఈ-పెట్టీ కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్కు సంబంధించిన 60,094, విపత్తు నిర్వహణ సంబంధిత 791 కేసులను పరిష్కరించారు. హైదరాబాద్ యూనిట్ 15,719 కేసుల పరిష్కారంతో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో మల్కాజిగిరి, సిద్దిపేట, రామగుండం, నల్గొండ జిల్లాలు నిలిచాయని చారుసిన్హా వెల్లడించారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి 53,434 మంది బాధితులకు రూ.399.06 కోట్లు సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. 2023లో రూ.8.3 కోట్లు, 2024లో రూ.183.9 కోట్లు, 2025లో రూ.183 కోట్లు రిఫండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.24.91 కోట్లు రిఫండ్ చేశారు.