
భారత కరెన్సీ ‘రూపాయి’ విలువ అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా పడిపోతుండటంతో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రంగంలోకి దిగింది. రూపాయి విలువను కాపాడేందుకు, మార్కెట్లో గందరగోళాన్ని తగ్గించేందుకు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆర్బీఐ ఇలాంటి కఠిన నిర్ణయాలు అరుదుగా తీసుకుంటుంది.. కానీ ప్రస్తుతం రూపాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ అడుగు వేసింది.
ఏమిటీ కొత్త నిబంధన..?
ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశంలోని అన్ని బ్యాంకులు తమ వద్ద ఉండే విదేశీ కరెన్సీ నిల్వలపై (Net Open Position – NOP) పరిమితిని పాటించాలి. ప్రతి రోజూ వ్యాపార సమయం ముగిసే సమయానికి.. భారత రూపాయికి వ్యతిరేకంగా బ్యాంకులు ఉంచుకునే నెట్ ఓపెన్ పొజిషన్ 100 మిలియన్ డాలర్లకు మించకూడదు. ఈ నిబంధనను ఏప్రిల్ 10వ తేదీలోగా అన్ని బ్యాంకులు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దీని పరిధి 1 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం.
రూపాయి ఎందుకు పడిపోతోంది..?
గత కొద్ది రోజులుగా రూపాయి విలువ వరుసగా రికార్డు స్థాయి కనిష్టాలకు పడిపోతోంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది పశ్చిమ ఆసియా యుద్ధం. ఫిబ్రవరి చివరలో మొదలైన యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం నేరుగా రూపాయిపై పడింది. రెండో కారణం.. పెట్టుబడుల ఉపసంహరణ. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి తమ డబ్బును వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడింది.
చారిత్రాత్మక పతనం అనేది మూడో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. 2011-12 తర్వాత రూపాయికి ఇది అత్యంత దారుణమైన ఏడాదిగా నిలిచింది. శుక్రవారం నాటికి డాలర్ విలువ రూ. 94.84 వద్ద ఆల్టైమ్ రికార్డు కనిష్టానికి చేరింది. త్వరలోనే ఇది రూ. 95 మార్కును దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నిర్ణయం వల్ల లాభమేంటి..?
బ్యాంకులు సాధారణంగా తమ లాభాల కోసం డాలర్లను కొని ఉంచుకుంటాయి. ఇలా బ్యాంకులు పెద్ద ఎత్తున డాలర్లను హోల్డ్ చేయడం వల్ల మార్కెట్లో రూపాయి విలువ ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్బీఐ పెట్టిన 100 మిలియన్ డాలర్ల పరిమితి వల్ల.. బ్యాంకులు ఇష్టానుసారంగా డాలర్లను నిల్వ ఉంచలేవు. దీనివల్ల మార్కెట్లో డాలర్ల లభ్యత పెరిగి.. రూపాయి విలువ మరీ వేగంగా పడిపోకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
రూపాయి విలువలో వచ్చే అనవసరపు హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ఇది ఒక బ్రేక్ లాగా పనిచేస్తుంది. గతంలో బ్యాంకులు తమ మూలధనంలో 25 శాతం వరకు ఇలాంటి పొజిషన్లు ఉంచుకునే వీలుండేది.. కానీ ఇప్పుడు ఆర్బీఐ నేరుగా ఒక పరిమితిని విధించడం ద్వారా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కేంద్ర బ్యాంకు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.