Reading Time: < 1 minute
Us Military Buildup West Asia Iran War Threat 2026

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచుతోంది. ప్రస్తుతం అక్కడ 57,000 మందికి పైగా అమెరికా సైనికులు మొహరించి ఉన్నారు. 2003 తర్వాత ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడం ఇదే మొదటిసారి.

పెరుగుతున్న సైనిక శక్తి..

గత వారంలోనే దాదాపు 5,000 మంది అదనపు సైనికులు అక్కడికి చేరుకున్నారు. వీరిలో 2,500 మంది మెరైన్ విభాగం వారు ఉన్నారు. రానున్న రోజుల్లో మరో 10,000 మందిని పంపేందుకు పెంటగాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాధారణంగా ఈ ప్రాంతంలో 40,000 మంది సైనికులు ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ సంఖ్య వేగంగా పెరుగుతోంది.

శనివారం నాటికి 3,500 మంది సైనికులతో కూడిన యూఎస్ఎస్ ట్రిపోలి యుద్ధనౌక పశ్చిమాసియా తీరానికి చేరుకుంది. ఇది అమెరికాలోని అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటి. మార్చి 24న సుమారు 2,000 మంది పారాట్రూపర్లు (విమానాల నుండి దూకే సైనికులు) అత్యవసరంగా బయలుదేరారు. వీరు ఇరాన్‌లోని కీలకమైన ‘ఖార్గ్ ద్వీపం’పై దాడి చేసే అవకాశముందని తెలుస్తోంది.

కాలిఫోర్నియా నుంచి మరో 2,500 మంది సైనికులతో యూఎస్ఎస్ బాక్సర్ యుద్ధనౌక వస్తోంది. దీనిపై అత్యాధునిక ఎఫ్-35బి యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి.

యుద్ధం ఎందుకు..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కఠిన నిర్ణయాల వెనుక మూడు ప్రధాన కారణాలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్‌లోని చమురు నిల్వలను ఆధీనంలోకి తీసుకోవడం. ఇరాన్ దగ్గర ఉన్నట్లు భావిస్తున్న 400 కిలోల యురేనియం (అణుబాంబు తయారీకి వాడేది) దొరకకుండా చేయడం. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడం.

అఫ్గానిస్థాన్, ఇరాక్ వంటి దేశాల్లో గతంలో జరిగిన ‘ముగింపు లేని యుద్ధాల’ను ఈ పరిణామాలు గుర్తుచేస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు కూడా తక్కువ మందితో మొదలైన యుద్ధం, ఆ తర్వాత లక్షలాది మంది సైనికుల వరకు వెళ్లింది. ఇరాన్ కూడా ఊరికే ఉండమని హెచ్చరిస్తోంది. అమెరికా దాడులు చేస్తే తాము మరింత తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. డ్రోన్ల వాడకం పెరిగిన ఈ కాలంలో యుద్ధం పాత పద్ధతుల్లో ఉండదని, ప్రాణనష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.