
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. సోమవారంత భారీ వర్షంతో పాటు వడగళ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాలతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో విస్తారంగా వర్షం, మంచు కురవడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానులు ఉంటాయని పేర్కొంది. అలాగే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక కాశ్మీర్ లోయలో అక్కడక్కడా భారీ వర్షం లేదా హిమపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లో రోజంతా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఇక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాతో సహా తూర్పు భారతదేశంలో కూడా వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పింది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ వర్షాలు, వడగళ్ల వాన పడే ఛాన్సుందని తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ భారత్లో కూడా..
అలాగే దక్షిణ భారత్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుతో సహా దక్షిణ రాష్ట్రాల్లో ఈ వారమంతా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రజలకు హెచ్చరిక
ఉరుములతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మెరుపులు మెరుస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వడగళ్ల వాన ఎక్కువగా పడే ప్రాంతాల్లోని రైతులు, నివాసితులు పంటలను, ఆస్తులను కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.