
తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణ , జంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభ సమావేశ హాలులో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ అధ్యక్షురాలు మేనకా గాంధీ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జంతు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు.
గోసంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కేవలం ఎన్కేపల్లిలోనే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల సమీపంలో కూడా గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోవుల పోషణ , రక్షణ కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి , వాటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలను అధికారులు మేనకా గాంధీ బృందానికి వివరించారు. ముఖ్యంగా వీధి కుక్కలకు నిర్వహిస్తున్న స్టెరిలైజేషన్ (కుక్కల నియంత్రణ) ప్రక్రియపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్యూర్ (CURE) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టడానికి , వాటికి మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అధికారులు వివరించారు.
జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై మేనకా గాంధీ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా స్టెరిలైజేషన్ , గోశాలల నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న చొరవను అభినందిస్తూ, జంతువుల సంక్షేమం పట్ల ఇదే నిబద్ధతను కొనసాగించాలని ఆమె కోరారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలువురు మున్సిపల్ కమిషనర్లు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంతు ప్రేమికులకు , పర్యావరణ హితంగా రాష్ట్ర అభివృద్ధిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది.