గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు రాగానే, మెట్లు దగ్గర వదిలేసిన మన చెప్పులు కనిపించకపోతే వచ్చే ఆవేదన అంతా ఇంతా కాదు. కానీ, మన పెద్దలు మాత్రం “చల్.. పోతే పోయాయిలే, మంచిదే జరిగింది” అంటుంటారు. ఆ మాట వినగానే మనకు ఒళ్లు మండుతుంది కానీ, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పోయింది చెప్పులు కాదు.. శని!: మన సంప్రదాయంలో పాదరక్షలను శని ప్రభావంతో పోలుస్తారు. కాళ్ళ దగ్గర ఉండే చెప్పులు పోవడమంటే, మనల్ని పట్టుకుని పీడిస్తున్న దరిద్రం లేదా శని దోషం ఆ రూపంలో వదిలిపోయిందని ఒక నమ్మకం. అందుకే చెప్పులు పోతే “పీడ విరగడైంది” అని సరిపెట్టుకుంటారు.

అహంకారం తగ్గుతుంది: గుడిలోకి వెళ్ళినప్పుడు మనం ఎంత భక్తితో ఉన్నా, బయటకు రాగానే మళ్ళీ ప్రాపంచిక విషయాల్లోకి వచ్చేస్తాం. సరిగ్గా అప్పుడే చెప్పులు కనిపించకపోతే ఒక్కసారిగా షాక్ తింటాం. ఆ సమయంలో కలిగే అసహనం, ఆ తర్వాత “సరేలే ఏం చేస్తాం” అని మనల్ని మనం సర్దిచెప్పుకునే గుణం మనలోని అహంకారాన్ని తగ్గిస్తుంది. కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం మనకు ఒక రకమైన వినయాన్ని నేర్పుతుంది.
గ్రహ దోషాల నివారణ:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరికైనా జాతకంలో శని దోషం బలంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. శనివారం పూట లేదా గుడి దగ్గర చెప్పులు పోతే, గ్రహ గతులు మారి మనకు రాబోయే పెద్ద ప్రమాదం తృటిలో తప్పిందని అర్థం. అంటే, ప్రాణాపాయం లాంటి పెద్ద కష్టం పోయి, చిన్నపాటి ఆర్థిక నష్టంతో (చెప్పుల ఖర్చుతో) బయటపడ్డామని భావించాలి.
చెప్పులు పోవడం అనేది భౌతికంగా నష్టమే అయినా, మానసికంగా అది ఒక పాజిటివ్ థింకింగ్. “మంచి జరిగింది” అని అనుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి, సెంటిమెంట్ పక్కన పెడితే.. ఇది మనల్ని ఒత్తిడి నుండి కాపాడే ఒక చక్కని మార్గం.
The post గుడిలో చెప్పులు పొతే మంచిది అంటారు ఎందుకు ? appeared first on Manalokam – Latest Telugu News & Updates.