
సిటీ శివార్లలోని రిసార్టులు మరోసారి మాదకద్రవ్యాల వేదికగా మారుతున్నాయి. గండిపేట్ సమీపంలోని చారిత్రాత్మక తారామతి బారాదరి రిసార్ట్ వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ డ్రగ్స్ పార్టీని పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ నటుడు సర్వర్ సహా పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ సంస్థ “మోర్ దాన్ ద ఫ్రెండ్స్” (More Than The Friends) అనే పేరుతో ఈ విందును ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి బాలీవుడ్ , టాలీవుడ్ కు చెందిన నటులు, హై-ప్రొఫైల్ వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పోలీసుల ప్రత్యేక బృందం ‘ఈగల్ టీమ్’ రిసార్ట్పై ఆకస్మికంగా సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో బాలీవుడ్ నటుడు సర్వర్, ప్రముఖ డీజే జాన్సన్, వ్యాపారవేత్తలు నిహార్, యోగేశ్వర్, అసి , ఫార్మస్యూటికల్ అనలిస్ట్ అవినాష్ ఉన్నారు. వీరితో పాటు పార్టీలో పాల్గొన్న మొత్తం 64 మంది నుంచి పోలీసులు రక్త నమూనాలను (Samples) సేకరించారు. ఈ నమూనాలను ల్యాబ్కు పంపి పరీక్షించిన తర్వాత మరికొందరి అరెస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..
నగరంలో డ్రగ్స్ సంస్కృతిని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వీకెండ్స్లో రిసార్టులు, ఫామ్ హౌస్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచారు. తారామతి బారాదరి వంటి ప్రభుత్వ పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంపై అధికారులు సీరియస్ అవుతున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.