Reading Time: < 1 minute
ఖానాపూర్‌ హైటెన్షన్‌కు తెర.. బీఆర్ఎస్ మద్దతుతో ఛైర్మన్ పీఠం దక్కించుకున్న బీజేపీ..!

ఎట్టకేలకు ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ముగిసింది. ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్ గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒక్క స్థానాల్లో గెలుపొందారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరుకుంది. అయితే మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికింది. దీంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకుని అధికార పార్టీకి షాకిచ్చింది.

నిన్నటి వరకూ ఖాన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు గురి చేసింది. చైర్మన్‌గా బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. BJP, BRS నేతలు మున్సిపల్ కార్యాలయం ముట్టడించి నిరసన తెలిపాయి. పోలీసులు, బీజేపీ నేతల‌ మధ్య తోపులాట జరిగింది. లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గందరగోళం మధ్య ఎన్నికల అధికారి చైర్మన్‌ ఎన్నిక ఇవాళ్టికి వాయిదా వేశారు. మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికతో ఖానాపూర్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో.. అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహారించాయి. ఏప్రిల్ 4, శనివారమే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావాల్సి ఉండగా.. పార్టీల సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అధికారులు ఎన్నికను నేటికి వాయిదా వేశారు. చివరికి బీఆర్ఎస్ మద్దతులో బీజేపీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఎన్నిక సమయంలో తమకు ఏడుగురు మద్దతు తెలిపారని కాంగ్రెస్‌ ఎక్స్‌అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..