Reading Time: 2 minutes

మన తెలంగాణ/ గజ్వేల్: గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కాం గ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులు ముట్టడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించి బీ ఆర్‌ఎస్, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కేసీఆర్ ఇప్పటికే రూ.కోటి 20 లక్షల వేతనం, ఇతర అలవెన్సులు పొందినట్లు అంక్షారెడ్డి ఆరోపించారు. వెంటనే ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండని కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ నిలిచినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆయన స్పందించకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇక్కడి సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ఘోరంగా వైఫల్యం చెందారు. గజ్వేల్ ప్రజలు, ముంపు బాధితులను నట్టేట ముంచినట్లు ఎద్దేవా చేశారు. దమ్ముంటే కేసీఆర్ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గజ్వేల్ ప్రజలను గాలికి వదిలినా, పట్టించుకోకున్నా, సీఎం రేవంత్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగినన్ని నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ క్యాంప్ కార్యాలయం అన్నింటికీ అడ్డాగా మరిందని, ఆయన మాత్రం ఇక్కడ అడుగుపెట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. వెంటనే క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు చేరుతుండటంతో జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డు తగులుతున్నట్టు వివరించారు.

కాగా, మొదటగా గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించడంతోపాటు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటేరు నరేందర్ రెడ్డి, వీరుపాక శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనుకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనారిటీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆజ్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.