Reading Time: < 1 minute
Telangana: సలాం పోలీస్.. చనిపోతూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంకు చెందిన నరాల శంకర్ యాదవ్(32) హైదరాబాద్ అంబర్ పేట ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ శంకర్‌కు ఇంకా వివాహం కాలేదు. అయితే గత నెల 29న స్వగ్రామానికి వచ్చిన శంకర్ తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై తుర్కపల్లికి బయల్దేరాడు. ఫ్రెండ్‌ను కలిసి తిరిగి వస్తుండగా భువనగిరి మండలం వడపర్తి వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ శంకర్‌ను పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. అయితే కొద్ది రోజులకే అతనికి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. వైద్యులు చెప్పిన మాటలు విని తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లీడుకొచ్చిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఈ క్రమంలో యుక్త వయస్సులో ఉన్న తమ కుమారుడి అవయవాలను దానం చేయాలని శంకర్ తల్లిదండ్రులకు జీవధాన్ ట్రస్ట్ సభ్యులు అవగాహన కల్పించారు. దీంతో శంకర్ అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. శంకర్ అవయవాలు గుండె, రెండు కళ్లు, కాలేయం, రెండు కిడ్నీలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స ద్వారా అమర్చినట్లు జీవధాన్ సభ్యులు తెలిపారు. తమ కొడుకు మరణించినా.. అవయవ దానం ద్వారా ఇతరుల్లో తమ కొడుకును చూసుకుంటున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.