
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగంలో డిజిటల్ సేవలకు కొత్త ఊపు ఇవ్వడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టూరిస్టులు తమ మొబైల్ నుంచే వాట్సాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త విధానం ద్వారా బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. పర్యాటక శాఖ అధికారిక వాట్సాప్ నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపితే చాలు, వెంటనే చాట్బాట్ స్పందిస్తుంది. తెలుగు లేదా ఇంగ్లీష్లో సేవలు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు సులభంగా బుకింగ్ చేయగలుగుతారు. హోటల్స్, బోటింగ్, బస్సు ప్యాకేజీలు, టూరిస్ట్ ఎంట్రీ టికెట్లు అన్ని ఒకే ప్లాట్ఫార్మ్లో లభించనున్నాయి.
పర్యాటక ప్రాంతం పేరు, సందర్శన తేదీ, వ్యక్తుల సంఖ్య వంటి వివరాలు ఎంటర్ చేస్తే క్షణాల్లో టికెట్ బుక్ అవుతుంది. ఇందుకోసం Kotak Mahindra Bank సహకారంతో చాట్బాట్ సేవలను అభివృద్ధి చేస్తున్నారు. చర్చలు చివరి దశలో ఉండగా త్వరలోనే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.
డిజిటల్ చెల్లింపుల సమయంలో డేటా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సైబర్ దాడులను నివారించేందుకు ఆధునిక ఎన్క్రిప్షన్ టెక్నాలజీ అమలు చేయనున్నారు. అదనంగా, థర్డ్ పార్టీ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి సేవలను పర్యవేక్షించనున్నారు.
గ్రీన్ టిక్ వెరిఫికేషన్..
ఫేక్ లింకులు, మోసాలను నివారించేందుకు వాట్సాప్లో గ్రీన్ టిక్ ఉన్న అధికారిక ఖాతా ద్వారానే సేవలు అందించబడతాయి. దీనివల్ల పర్యాటకులు నమ్మకంగా సేవలను వినియోగించుకోవచ్చు.
ఇక వాట్సాప్తో పాటు ప్రత్యేక టూరిజం మొబైల్ యాప్ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, హోటల్ లభ్యత, టూర్ ప్యాకేజీలు, సమయాల వివరాలు అన్ని ఒకేచోట అందుబాటులో ఉంటాయి. టూరిస్టులు ఎక్కడి నుంచైనా తమ ట్రిప్ను ముందుగానే ప్లాన్ చేసుకునే వీలుంటుంది.
ఇప్పటికే కేరళలో అమలు..
దేశంలో ఇప్పటికే కేరళ రాష్ట్రం ‘మాయ’ పేరుతో వాట్సాప్ చాట్బాట్ సేవలను విజయవంతంగా అమలు చేస్తోంది. అక్కడ పర్యాటకులకు 24/7 సమాచారం, ఈ-టికెటింగ్, వాతావరణ అప్డేట్స్ అందుతున్నాయి. ఇదే మోడల్ను అనుసరించి రాష్ట్రంలో కూడా సేవలను వేగంగా అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ కొత్త డిజిటల్ వ్యవస్థతో పర్యాటక రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా, సందర్శకులకు వేగవంతమైన సేవలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే టూరిజం బుకింగ్ పూర్తిగా మొబైల్లోకి మారనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి..