
Donald Trump: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ఉద్రిక్తంగా మారుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చమురు సంక్షోభం పెరిగింది. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన డెడ్లైన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు ఆదివారం ట్రంప్ భారీ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి, త్వరగా మాతో డీల్ చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్ను నరకంగా మారుస్తామని, సమయం లేదని హెచ్చరించారు.
Read Also: Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..
అయితే, ట్రంప్ హెచ్చరికలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) మాజీ డైరెర్టర్ మొహమ్మద్ ఎల్బరాడెయ్ స్పందించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని గల్ఫ్, ఐక్యరాజ్యసమితి(యూఎన్)ను కోరారు. ఎల్బరాడెయ్ తన ఎక్స్ పోస్టులో .. ‘‘ మరోసారి ఈ పిచ్చివాడు ఈ ప్రాంతాన్ని అగ్నిగోళంగా మార్చకముందే అతడిని ఆపడానికి మీ శక్తి మేరకు పనిచేయండి’’అని అన్నారు. ఎల్బరాడెయ్ ప్రాంతీయ నాయకులనే కాకుండా ప్రపంచసంస్థల్ని కూడా ప్రశ్నించారు. భద్రతామండలి, యూఎన్ చీఫ్ ఆంటోనియో గెటెర్రస్, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు కలుగజేసుకోవాలని ఆ దేశ అధ్యక్షులను ట్యాగ్ చేశారు.
యుద్ధం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇటు అమెరికా, అటు ఇరాన్ ఒకరికొకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ యుద్ధంలో ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్లపై విరుచుకుపడుతోంది. ఈ దేశాల్లో గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు చేస్తోంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు రవాణాకు కీలకంగా ఉన్న ఇరుకైన జలమార్గం ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది.