
హైదరాబాద్, వెలుగు: నీటిపారుదల శాఖలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన అధికారుల సర్వీస్ను క్రమబద్ధీకరించి, పెన్షన్ ప్రయోజనాలను కల్పించాలన్న గత ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు నీటి పారుదల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన రాహుల్ బొజ్జా, అప్పటి ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, ఈఎన్సీ అనిల్ కుమార్, ఎస్ఈ సుధీర్, ఈఈ హెచ్వీ.రాంప్రసాద్కు సూచించింది.
నీటిపారుదల శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే వారిని1993 నుంచి క్రమబద్ధీకరించాలని, ఆ తేదీ నుంచే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలని హైకోర్టు 2023లో ఉత్తర్వులిచ్చింది. వీటిని అమలు చేయలేదంటూ జగన్నాథం సహా ఏడుగురు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ఈ నెల 13లోగా ఉత్తర్వులు అమలు చేయాలని, లేని పక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.