
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారంలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కేరళ స్టోరీ నుంచి ధురంధర వరకు ప్రతీ సినిమా అబద్ధమని చెబుతున్న ఈ పార్టీలే అబద్ధాలు చెప్పడంలో నిపుణులయ్యారని ఆయన అన్నారు. కేరళలోని తిరువల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అబద్ధాలు చెప్పడంలో నిపుణులయ్యాయని విమర్శించారు. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు అబద్ధాల ఫ్యాక్టరీలుగా మారాయని అన్నారు. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (FCRA), యూనిఫాం సివిల్ కోడ్ (UCC)లకు ఇటీవల చేసిన సవరణలపై అనవసర భయాలు సృష్టిస్తు్న్నారని మండిపడ్డారు.
దేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇరాన్, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయ వలసదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహించారు. ఎన్నికల ప్రయోజనం కోసం ఈ వలసదారుల భద్రతను కాంగ్రెస్ ప్రమాదంలోకి నెడుతోందని విమర్శించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటల ద్వారా గల్ఫ్ దేశాలో భారత్కు ఉన్న బంధాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. పశ్చిమాసియా దేశాలు భారత్ను శత్రువుగా చూడాలని చూస్తున్నారని కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు.
Read Also: Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
ఇరాన్లో పనిచేస్తున్న తమిళనాడు, గోవా, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన భారతీయ మత్స్యకారులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారిని రక్షించే పనిలో ప్రభుత్వం చురుకుగా నిమగ్నమై ఉందని, ఇప్పటికే వందలాది మంది సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. గల్ఫ్, ఇరాన్లో ఉంటున్న భారతీయుల భద్రతకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
శబరిమల ఆలయం నుంచి బంగారం అదృశ్యం కావడంపై మోడీ మాట్లాడుతూ.. పుణ్యక్షేత్రం ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి రెండు వైపులు అని అన్నారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.