
నేటి కాలంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా, చేతిలో ఉన్న డబ్బుకు భద్రతతో పాటు నెలనెలా కొంత ఆదాయం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, పదవీ విరమణ చేసిన వారు సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం వెతుకుతుంటారు. అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఒకేసారి పెట్టుబడి పెట్టి, ఐదేళ్ల పాటు ప్రతి నెలా వడ్డీ రూపంలో లాభం పొందడం ఈ పథకం ప్రత్యేకత.
భార్యాభర్తలకు జాయింట్ ఖాతా సౌకర్యం
ఈ పథకంలో వ్యక్తిగతంగా ఖాతా తెరవడమే కాకుండా భార్యాభర్తలు కలిసి ఉమ్మడి ఖాతా తీసుకునే సౌకర్యం కూడా ఉంది. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కానీ జాయింట్ అకౌంట్లో ఏకంగా రూ.15 లక్షల వరకు జమ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో వడ్డీని పొందే వీలు కలుగుతుంది.ఇది ఒక కుటుంబం యొక్క నెలవారీ ఖర్చులకు ఎంతగానో తోడ్పడుతుంది.
వడ్డీ రేట్లు – నెలవారీ ఆదాయం లెక్కలు
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఈ పథకంపై ఏటా 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఒకవేళ భార్యాభర్తలు కలిసి రూ.15 లక్షలను ఈ పథకంలో డిపాజిట్ చేస్తే వారికి సంవత్సరానికి సుమారు రూ.1,11,000 వడ్డీ లభిస్తుంది. దీనిని నెలల వారీగా విభజిస్తే..ప్రతి నెలా మీ చేతికి సుమారుగా రూ.9,250 ఆదాయం అందుతుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఈ మొత్తం నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలోకి వచ్చి చేరుతుంది.
ఐదేళ్ల తర్వాత అసలు మొత్తం వెనక్కి
ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఐదు సంవత్సరాలలో మీరు పొందే మొత్తం వడ్డీ సుమారు రూ.5.5 లక్షల వరకు ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఐదేళ్ల తర్వాత మీరు ప్రారంభంలో పెట్టిన రూ.15 లక్షల అసలు పెట్టుబడి మీకు సురక్షితంగా తిరిగి వస్తుంది. అంటే మీ అసలు సొమ్ము తగ్గకుండానే అదనపు ఆదాయాన్ని పొందే వీలుండటం ఈ పథకం యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్.
ఖాతా తెరవడం ఎలా?
పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ ఖాతా తెరవడం చాలా సులభం. మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్కు వెళ్లి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను సమర్పించి ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఎఫ్డీలకంటే క్రమమైన ఆదాయం కోరుకునే వారికి, సీనియర్ సిటిజన్లకు ఇది ఒక అద్భుతమైన వేదిక. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండటం వల్ల ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బు విషయంలో ఎటువంటి డోకా ఉండదు.