
సీఐడీ పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో రూ.60 కోట్ల విలువైన హెరాయిన్తో నలుగురు స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. డ్రోన్ ద్వారా భారత్లో పడేసిన డ్రగ్స్ను తీసుకెళ్లేందుకు వచ్చిన నిందితులను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. డ్రగ్స్, గంజాయి వంటివి అమ్మినా, కొనుగోలు చేసినా, సేవించినా చట్టరీత్యా నేరం. అలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన శిక్షకు అర్హులు. మన దేశంలో ఇప్పటికే డ్రగ్స్ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. దీని ద్వారా లక్షల్లో, కోట్లలో వ్యాపారం జరుగుతుంది.
ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనలో శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ సరఫరా కావడం అందరినీ విస్తుపోయేలా చేసింది. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా వచ్చిన 12 కిలోల హెరాయిన్ రూ.60 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. ఈ హెరాయిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన నిందితులను సీఐడీ, పోలీస్ బృందం తమ చాకచక్య పనితీరుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాని అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడి నుంచి పంజాబ్కు ఈ డ్రగ్స్ సరఫరా చేయాలన్న ప్లాన్ తాజాగా జరిగిన ఆపరేషన్ ద్వారా బయటపడింది.

ఇంత పెద్దమొత్తంలో డ్రోన్ ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన డ్రగ్స్ ను, దానికోసం వచ్చిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పూర్తి వివరాలు సేకరించి, ఇంకా ఇలాంటి అక్రమ వ్యాపారాలకు సంబంధించి పథకాలను మట్టుబెట్టే పనిలో పోలీసులు, సీఐడీ అధికారులు ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా పటిష్ట చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.