
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీతో శుభారంభం ఇవ్వగా, ధ్రువ్ జురెల్ 42 బంతుల్లోనే 75 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి విధ్వంసం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా మెరుపులతో రాజస్థాన్ తన స్కోరును 200 దాటించింది. గుజరాత్ బౌలర్లలో అశోక్ శర్మ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, మహమ్మద్ సిరాజ్ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది.
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్ , కుమార్ కుశాగ్ర మంచి పునాది వేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ 44 బంతుల్లో 73 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అయితే, మిడిల్ ఓవర్లలో రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశాడు. బిష్ణోయ్ ఒకే ఓవర్లో రాహుల్ తెవాటియా , గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లు తీసి మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పాడు. చివర్లో రషీద్ ఖాన్ (24) , కగిసో రబాడ (23) పోరాడినప్పటికీ, రాజస్థాన్ బౌలర్ల క్రమశిక్షణ ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. 19వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.
చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ పరాగ్ బంతిని తుషార్ దేశ్పాండేకు అప్పగించాడు. దేశ్పాండే అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్కు ప్రయత్నించిన రషీద్ ఖాన్, ఆర్చర్ చేతికి చిక్కి అవుట్ కావడంతో రాజస్థాన్ విజయం ఖాయమైంది. చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన తరుణంలో దేశ్పాండే వేసిన ఫుల్ టాస్ను అశోక్ శర్మ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అద్భుత స్పెల్ వేసిన రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.