
Khanapur Municipality: గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేతులు కలపడంతో ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ వశమైంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని విషయం తెలిసిందే.
అయితే చైర్మన్ పీఠం కోసం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో చైర్మన్ పదవిని బీజేపీ దక్కించుకోగా, వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లింది. మున్సిపల్ చైర్మన్ గా అంకం మౌనిక (బీజేపీ 9వ వార్డు కౌన్సిలర్), వైస్ చైర్మన్ గా మహమ్మద్ షోయబ్ (బీఆర్ఎస్ 6వ వార్డు కౌన్సిలర్) గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు కౌన్సిలర్లు ఉండగా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావించినప్పటికీ, విపక్షాల ఐక్యత ముందు ఆ పప్పులు ఉడకలేదు. బీఆర్ఎస్ (4), బీజేపీ (4) సభ్యులు ఏకం కావడంతో మెజార్టీ మార్కును సులువుగా దాటగలిగారు.
Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్
నిజానికి ఈ ఎన్నిక శనివారమే జరగాల్సి ఉంది. అయితే సభ్యుల మధ్య తలెత్తిన వివాదం, అధికారులతో ఎమ్మెల్యే వాగ్వాదం కారణంగా హైడ్రామా చోటుచేసుకుని ఎన్నిక ఆదివారానికి వాయిదా పడింది. నేడు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య జరిగిన ఎన్నికలో విపక్షాలు పైచేయి సాధించాయి. ఫలితం వెలువడగానే బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అధికార పార్టీని నిలువరించేందుకు విపక్షాలు ఏకం కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.