Reading Time: 2 minutes
Cm Revanth Reddy Young India Sports University Telangana

భాగ్యనగరం ఒకప్పుడు భారత ఫుట్‌బాల్‌కు వెన్నెముకగా నిలిచిందని, ఆ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూ యువతకు దిశానిర్దేశం చేశారు.

1950 నుండి 1960 మధ్య కాలంలో హైదరాబాద్‌ను ‘నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్’గా పిలిచేవారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 1956 ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టులో ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్‌కు చెందిన వారే ఉండటం మన నగర ఖ్యాతికి నిదర్శనమన్నారు. అలాగే, నిఘా వ్యవస్థను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన స్పై మాస్టర్ బీఎన్ మల్లిక్ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ టోర్నమెంట్‌లో దేశం నలుమూలల నుండి వచ్చిన 34 జట్లు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాయని క్రీడాకారులందరినీ అభినందించారు.

RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

ఇటీవల తాను సందర్శించిన దక్షిణ కొరియాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “కేవలం 4 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా 30కి పైగా పతకాలు సాధిస్తుంటే, 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒక్క బంగారు పతకం సాధించడానికి ఇబ్బంది పడుతోంది. అక్కడ ఒక చిన్న అమ్మాయి రెండు బంగారు పతకాలు సాధించింది. ఈ పరిస్థితి మారాలి,” అని ఆయన ఆకాంక్షించారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు బోర్డు మెంబర్లుగా ఉండి క్రీడలను ప్రోత్సహిస్తారని తెలిపారు.

యువత నెమ్మదిగా క్రీడా మైదానాలకు దూరమై పబ్, డ్రగ్స్ కల్చర్‌కు బానిసలవుతుండటంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. “చదువుకున్న యువతే ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం వీరులను అందించిన పంజాబ్, నేడు డ్రగ్స్ సమస్యతో సతమతమవుతోంది. తెలంగాణను మరో పంజాబ్‌గా మారనివ్వం,” అని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా మారాయని, ఏఐ (AI) అనేది ఒక రెండు అంచుల కత్తి లాంటిదని, దీనిని సరైన విధంగా వాడుకుంటూ నేరాలను అరికట్టాలని పోలీసులకు సూచించారు.

Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..

క్రీడల్లో రాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. దానికి నిదర్శనంగా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు 2 కోట్ల నగదు పురస్కారం అందించామని గుర్తు చేశారు. అలాగే, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ పదో తరగతి ఫెయిల్ అయినప్పటికీ, నిబంధనలు సడలించి అతడికి డీఎస్పీ ఉద్యోగం కల్పించామని, పారా ఒలింపిక్స్‌లో రాణించిన దీప్తి జురాంజికి కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని తెలిపారు.

ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో కలిసి ఆడే అవకాశం కల్పించడమే కాకుండా, యువతకు మార్గదర్శనం చేసేందుకే మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువచ్చామని చెప్పారు. క్రీడల్లో రాణించే యువతకు ఉద్యోగాల విషయంలో తనదే హామీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.