Reading Time: < 1 minute
Tiger Spotted On Nelakota Hill Panic Grips Polavaram Villages In Andhra Pradesh

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో నేలకోట కొండపై తిష్ట వేసిన పెద్దపులి స్థానికుల కంటపడింది. ప్రస్తుతం రామదుర్గం కొండ పైన మకాం వేసిన పెద్దపులిని స్థానికులు వీడియో తీశారు. మనుషుల్ని చూసిన పెద్దపులి ఎలాంటి దాడి చేయకుండా వెనుకడుగు వేసింది. పాపికొండల అభయారణ్యం నుంచి బయటికి వచ్చిన తర్వాత గత 40 రోజులుగా సంచారం చేస్తూ దేవీపట్నం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఖాళీ చేసిన గ్రామాల వద్దకు పెద్దపులి చేరుకుంది. నాలుగు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చి మైదాన ప్రాంతంలోని సీతానగరం మండలం పెద్ద కొండేపూడి పరిసర గ్రామాల వద్దకు రావడంతో కలకలం ఏర్పడింది.

Also Read: Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!

కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ పోలవరం జిల్లా నేలకోట అటవీ ప్రాంతంలోకి చేరుకోవడంతో పోచమ్మగండి-శరభవరం పరిసర గిరిజన గ్రామాల్లో అటవీశాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అవసరం లేకుండా అడవి ప్రాంతాలకు వెళ్లొద్దని, గుంపులుగా మాత్రమే సంచరించాలని సూచించారు.‌ అటవీశాఖ ప్రత్యేక బృందాలు పెద్దపులికి అమర్చిన రేడియో కాలర్ నుంచి వస్తున్న సిగ్నల్స్ ద్వారా వెంబడిస్తున్నారు. మరోవైపు కొండపై తిష్ట వేసిన ఈ పెద్ద పులికి ఆహారం లేదని అంచనా వేస్తున్నారు.‌ పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానిక పోలవరం నిర్వాసితు ప్రజలు వ్యవసాయం పనులకు వెళ్లలేకపోతున్నారు.‌ తమ పశువులపై పంజా విసురుతుందని భయపడుతున్నారు.