
శ్రీలంకలోని ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ ‘లీట్రో గ్యాస్ లంక లిమిటెడ్’, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ ధరలు ఈరోజు (ఏప్రిల్ 05) అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం , ఇతర అంతర్జాతీయ పరిణామాల వల్ల గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల గ్యాస్ దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అయితే.. ప్రస్తుతం శ్రీలంకలో సింహళ , తమిళ నూతన సంవత్సర వేడుకల సమయం కావడంతో, సామాన్యులపై భారం తగ్గించడానికి కనీస స్థాయిలోనే ధరలను సవరించినట్లు కంపెనీ పేర్కొంది.
Also Read:Spirit: స్పిరిట్ సినిమాపై అనంత శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రభాస్ను అలా చూస్తారంటూ..
12.5 కిలోల సిలిండర్ ధర రూ. 775 పెరిగింది. దీనితో పాత ధర నుంచి ఇప్పుడు రూ. 4,765కు చేరింది. 5 కిలోల సిలిండర్ ధర రూ. 308 పెరిగి రూ. 1,910కి చేరింది. 2.3 కిలోల సిలిండర్ ధర రూ. 140 పెరిగి రూ. 890కి చేరింది. ధరలు పెరిగినప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత లేకుండా చూస్తామని లీట్రో గ్యాస్ సంస్థ ప్రజలకు భరోసా ఇచ్చింది. ఏప్రిల్ నెల కోసం ఆర్డర్ చేసిన 38,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, ఇవి దేశవ్యాప్తంగా నిరంతర సరఫరాకు సరిపోతాయని తెలిపింది. అలాగే.. మరో రెండు భారీ నౌకల ద్వారా మొత్తం 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ మార్గమధ్యంలో ఉందని.. దీనివల్ల మే నెలలో కూడా గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కంపెనీ వెల్లడించింది.