Reading Time: < 1 minute
Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యనే హత్య చేశాడు భర్త. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య చేసిన అనంతరం పారిపోయాడు. పైన ఫోటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు పరమేశ్వర రావు, లీలావతి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని APR కాలనీలోని గేటెడ్ కమ్యూనిటీలో కొడుకు, కోడలితో కలిసి నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా భార్య లీలావతిపై అనుమానం పెంచుకున్నాడు భర్త. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కొడుకు, కోడలు నచ్చజెప్పడంతో కాస్త గొడవలు సద్దుమణిగినా…భర్త మాత్రం అనుమానాన్ని వీడలేదు. ఎలాగైనా తన భార్యను చంపాలని అనుకున్న పరమేశ్వర రావు సమయం కోసం వేచి చూస్తున్నాడు. కొడుకు కోడలు ఆదివారం పని మీద బయటికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో మళ్ళీ భార్యతో గొడవకు దిగాడు పరమేశ్వర రావు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో లీలావతిని చితకబాదాడు. అనంతరం ఇంట్లో ఉన్న కత్తితో పలు మార్లు పొడవడంతో లీలావతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావంతో లీలావతి ప్రాణాలు విడవగా… అక్కడి నుంచి భర్త పరమేశ్వర రావు పారిపోయాడు. బయటికి వెళ్లిన కొడుకు కోడలు ఇంటికి వచ్చేసరికి లీలావతి రక్తపు మడుగులో పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అనుమానం పెను భూతంగా మారి కట్టుకున్న భార్యని ఐదు పదుల వయసులో హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.

Also Read: ఏపీలో ‘అడవి ఆవులు’ నిజంగా ఉన్నాయా..? అవి ఎక్కడి నుంచి వచ్చాయి..