Reading Time: < 1 minute
Midnight Tremors In Araku Valley Panic In Visakhapatnam As People Rush Outdoors

ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో భూ ప్రకంపనలు సంభవించడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కంపనలు సంభవించాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం రాత్రి సుమారు 11:35 గంటల సమయంలో అరకు వ్యాలీ పరిసరాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉండగా.. ఈ ఘటన కలవరపరిచింది. కొందరు భూకంపమని అనుమానించగా.. మరికొందరు ఇతర కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

Also Read: Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!

గత ఏడాది డిసెంబర్ నెలలో కూడా ఇదే ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అవకాశాలపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే తాజా ప్రకంపనలు నిజంగా భూకంపమా లేక ఇతర భౌగోళిక లేదా సాంకేతిక కారణాల వల్ల జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సంబంధిత అధికారులు పరిశీలనలు చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.