
Congress: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్పీజీ సంక్షోభం, ప్రభుత్వ విదేశాంగ విధానంపై రాహుల్ ప్రధాని నరేంద్రమోడీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. కమల్ నాథ్, ఆనంద్ శర్మ, శశి థరూర్, మనీష్ తివారీ వంటి కాంగ్రెస్ ముఖ్యులు రాహుల్ గాంధీ అభిప్రాయంతో విభేధించారు. యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంపై మోడీ ప్రభుత్వ దౌత్య వైఖరిని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే, మిగతా సీనియర్లు మాత్రం ప్రభుత్వం ఈ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించినట్లు ప్రశంసించారు.
ప్రధాని మోడీ నాయకత్వం, విదేశాంగ విధానం ‘‘రాజీ’’ పడిందని విమర్శించగా, శశి థరూర్ మాత్రం ‘‘బాధ్యతాయుతమైన రాజనీతి’’గా అభివర్ణించారు. గురువారం ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కేంద్రమంత్రి ఆనంద్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. ఆనంద్ శర్మ తన సోషల్ మీడియా పోస్టులో..‘‘ ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఐక్యతకు పిలుపునిచ్చారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని భారత్ పరిణితి, నైపుణ్యంతో నిర్వహించింది’’ అని కొనియాడారు. ఎల్పీజీ పరిస్థితిపై కమల్ నాథ్ మాట్లాడుతూ.. కొరత లేదని చెప్పారు.
కాంగ్రెస్ నేతల ప్రశంసల తర్వాత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ.. కాంగ్రెస్ ఇకనైనా తన రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీ ఒక అవకాశవాది, భారత వ్యతిరేకి అని కాంగ్రెస్కు తెలుసు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.