Reading Time: 2 minutes
CKYC ఉన్నా KYC పదే పదే ఎందుకు చేయాలి? అసలు అది ఎందుకు అవసరం?

ఇండియా ప్రపంచంలోనే అత్యాధునిక డిజిటల్ గుర్తింపు వ్యవస్థలను నిర్మించిన దేశంగా గుర్తింపు పొందింది. RBI, SEBI వంటి నియంత్రణ సంస్థల మార్గదర్శకాలతో బ్యాంకింగ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ వరకు అన్నీ డిజిటల్ మార్గంలో అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ వినియోగదారుల అనుభవం మాత్రం విభిన్నంగా ఉంది. ఒకసారి KYC పూర్తి చేసినప్పటికీ, ప్రతి కొత్త సేవ కోసం మళ్లీ అదే ప్రక్రియ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సెంట్రల్ రిజిస్ట్రీ అఫ్ సెక్యూరిటిసాటిన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ నిర్వహణలో CKYC (సెంట్రల్‌ నో యువర్‌ కస్టమర్‌) వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఒకసారి KYC పూర్తి చేస్తే, అన్ని ఆర్థిక సంస్థలు అదే సమాచారాన్ని ఉపయోగించుకోవాలన్నదే దీని లక్ష్యం. అయితే ఆచరణలో ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.

నిపుణుల ప్రకారం ప్రతి ఆర్థిక సంస్థకు స్వతంత్ర బాధ్యతలు ఉండటం ప్రధాన కారణం. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా సంస్థలు తమ కస్టమర్ల గుర్తింపును స్వయంగా ధృవీకరించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి. దీంతో CKYC రికార్డు ఉన్నప్పటికీ, అదనపు ధృవీకరణ అవసరం అవుతోంది. అంతేకాకుండా, వేర్వేరు నియంత్రణ సంస్థలు వేర్వేరు KYC ప్రమాణాలు అమలు చేయడం వల్ల ప్రామాణీకరణలో లోపాలు కనిపిస్తున్నాయి. డేటా నాణ్యత, అప్డేట్ ఆలస్యం, సిస్టమ్‌ల మధ్య పరిమిత అనుసంధానం వంటి సాంకేతిక సమస్యలు కూడా CKYC సమర్థతను తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు ఆధార్, డిజిలాకర్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నప్పటికీ, అవి CKYCతో పూర్తిగా సమన్వయం కాలేదు.

ఇక మరో కోణంలో చూస్తే KYC ప్రక్రియ సంస్థలకు డేటా సేకరణ సాధనంగా కూడా మారింది. వినియోగదారుల వివరాలు ప్రవర్తనా సరళి వంటి సమాచారం మార్కెటింగ్, రిస్క్ విశ్లేషణకు ఉపయోగపడుతోంది. దీంతో పునరావృత KYC పూర్తిగా తగ్గకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. అయితే పదేపదే KYC చేయాల్సి రావడం వినియోగదారుల్లో అసహనం పెంచుతోంది. ప్రతి సారి వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోవాల్సి రావడం గోప్యతా సమస్యలను కూడా రేకెత్తిస్తోంది. డేటా లీక్‌లు, మోసాల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ఇది మరింత కీలక అంశంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పూర్తి స్థాయి పరిష్కారం కోసం అన్ని వ్యవస్థల మధ్య సమన్వయం, ప్రామాణీకరణ, రియల్‌టైమ్ డేటా అప్డేట్‌లు అవసరం. CKYCను నిజంగా ఒకే గుర్తింపు వేదికగా మార్చాలంటే, నియంత్రణ సంస్థలు, ఆర్థిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి