Reading Time: 2 minutes
Atchannaidu Slams Jagan Over Mavignan Drama Targets Three Capitals Policy

Minister Atchannaidu: అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో రాజకీయ నాటకానికి శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. గతంలో అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అంగీకరించి మద్దతు తెలిపినవారే ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టిందని, కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు.

2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి రాకపోయేదని ఆయన పేర్కొన్నారు అచ్చెన్నాయుడు… తమ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.54 వేల కోట్లు ఖర్చు చేసి మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై కక్ష సాధింపుగా వ్యవహరించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులు పూర్తిచేసినా రాజధాని నిర్మాణం పూర్తయ్యేదని, కానీ వాటిని కూడా నిలిపివేశారని అన్నారు. అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ అవమానించారని, కులాల పేరుతో విభేదాలు రేపారని విమర్శించారు.

అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినప్పటికీ వాటిని నిరూపించలేకపోయారని అన్నారు అచ్చెన్నాయుడు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ వైషమ్యాలు పెంచారని, ప్రజలను మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, దాని కోసం ప్రభుత్వ నిధులు అవసరం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లోనే అమరావతి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు.

మూడు రాజధానుల వల్ల రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏ ప్రయోజనం కలిగిందో చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టులు నిలిచిపోయాయని, ప్రజలను మోసం చేశారని అన్నారు. చివరగా, అమరావతి రాష్ట్ర భవిష్యత్తుకు కేంద్రబిందువుగా కొనసాగుతుందని, దాని ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజలు మళ్లీ తప్పు నిర్ణయం తీసుకోరని, అభివృద్ధికి అనుకూలంగా నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు..