Reading Time: < 1 minute
డిఫాల్టర్‌ కాకపోయినా తగ్గిన సిబిల్‌ స్కోర్‌! సుప్రీం కోర్టుకెళ్లిన వ్యక్తి.. కోర్టు ఏం చెప్పిందంటే?

ఎలాంటి రుణ బకాయిలు లేకపోయినా క్రెడిట్ స్కోర్ ప్రతికూలంగా నమోదైన కేసులో సుప్రీం కోర్టు కీలక జోక్యం చేసుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్ర సింగ్ పన్వార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, సంబంధిత బ్యాంకుల నుంచి వివరాలు కోరుతూ చర్యలు చేపట్టింది. పన్వార్ తన పిటిషన్‌లో తాను ఎప్పుడూ రుణం తీసుకోకపోయినా లేదా చెల్లింపులలో డిఫాల్ట్ చేయకపోయినా, 2020 నుండి తన సిబిల్‌ స్కోర్‌ నెగటివ్‌గా చూపబడుతోందని పేర్కొన్నారు. ఈ కారణంగా తాను రుణాలు, క్రెడిట్ కార్డులు వంటి ఆర్థిక సేవలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాదించారు.

ఈ సమస్యకు మూలకారణంగా ఒకే పేరుతో ఉన్న ఇతర వ్యక్తులకు అదే పాన్‌ నంబర్ జారీ కావడం వల్ల జరిగిన డేటా గందరగోళం అని ఆయన తెలిపారు. ఇతరుల డిఫాల్ట్‌లు తన క్రెడిట్ రికార్డులో ప్రతిబింబించడంతో తన స్కోర్ దెబ్బతిన్నట్లు చెప్పారు. కొత్త పాన్‌ కార్డ్‌ తీసుకున్నప్పటికీ పాత కొత్త పాన్‌ల అనుసంధానం కారణంగా సమస్య కొనసాగింది. ఈ నేపథ్యంలో కోర్టు SBI, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వంటి ప్రధాన బ్యాంకులను పన్వార్‌పై ఎలాంటి బకాయిలు ఉన్నాయో వివరించమని ఆదేశించింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పీఎన్‌బీ, పన్వార్‌పై ఎలాంటి డిఫాల్ట్ లేదని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ కూడా తన రికార్డుల్లో ప్రతికూల సమాచారం లేదని తెలిపింది.

ఈ వివరణల అనంతరం ట్రాన్స్‌యూనిన్‌ సిబిల్‌ పన్వార్ క్రెడిట్ రికార్డులను సరిచేసినట్లు కోర్టుకు తెలియజేసింది. దీంతో ఆయనకు ఉపశమనం లభించింది. ఇక మరోవైపు ఇండియాలో క్రెడిట్ అవగాహన వేగంగా పెరుగుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 18.3 కోట్ల మంది తమ సిబిల్ స్కోర్‌ను చురుకుగా ట్రాక్ చేస్తున్నారు. వీరిలో దాదాపు 75 శాతం మంది మెట్రో నగరాల బయట నివసించడం విశేషం. ఇది ఆర్థిక ప్రవర్తనలో విస్తృత మార్పును సూచిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రెడిట్ స్కోర్‌ను ఇప్పుడు కేవలం రుణాల కోసం మాత్రమే కాకుండా, ఒక దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్య సూచికగా ప్రజలు భావిస్తున్నారు. ఈ సంఘటన కూడా వ్యక్తిగత డేటా ఖచ్చితత్వం, క్రెడిట్ రిపోర్ట్ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి