
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయాం హీటెక్కింది. ఈ క్రమంలోనే టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 5) ముర్షిదాబాద్లో జరిగిన బహిరంగ సభలో దీదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెంగాల్ను అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను బెదిరిస్తున్నారని, ఓటర్ల జాబితాలను తారుమారు చేయిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే ప్రయత్నాలు ప్రజలను భయపెట్టడానికేనని మండిపడ్డారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే బహిరంగంగా పోరాడాలని సవాల్ విసిరారు.
రైతులకు ప్రత్యేక బడ్జెట్:
టీఎంసీ తిరిగి తిరిగి అధికారంలోకి వస్తే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెడతామని దీదీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను నెమ్మదింపజేయడానికే సుమారు 500 మంది అధికారులను తొలగించారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తి అవ్వగానే అన్ని పనులు తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.
►ALSO READ | రిటైర్మెంట్ ప్లాన్ మారుతోంది: మెట్రో నగరాలకు గుడ్-బై.. చిన్న పట్టణాలకు వెల్కమ్!
ఫరక్కా వంటి ప్రాంతాలలో మైనారిటీ వర్గాల కోసం రోడ్లు, కమ్యూనిటీ హాళ్లతో సహా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం అన్ని మతాల ప్రజల కోసం పనిచేస్తుందని, విభజన రాజకీయాలను సమర్థించదన్నారు. టీఎంసీ తిరిగి అధికారంలోకి రాకపోతే బెంగాలీ భాష, గుర్తింపు ప్రమాదంలో పడతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2026
పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం మమతా బెనర్జీ టీఎంసీ కంచుకోట భవానీపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి సువేందు అధికారి దీదీపై పోటీ చేస్తున్నారు.