Reading Time: 2 minutes
Was Advised To Take Shelter In Bunker Pak President Zardari Admits Fear During Op Sindoor

Asif Ali Zardari: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా భయపడిందో, ఎలా దెబ్బతిందనే సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో భయానక వాతావరణం ఉందని జర్దారీ అంగీకరించారు. భారత దాడుల సమయంలో భద్రత కోసం బంకర్‌లోకి వెళ్లాలని తన సైనిక కార్యదర్శి తనకు సలహా ఇచ్చారని అన్నారు.

Read Also: CP Sajjanar: ‘క్యాబ్’ ఎక్కుతారా.. ‘కోర్టు’ మెట్లెక్కుతారా?.. మందుబాబులకు పోలీసుల నయా ‘క్లాస్’

‘‘నా సైనిక కార్యదర్శి నా దగ్గరకు వచ్చి యుద్ధం ప్రారంభమైందని చెప్పారు. మనం బంకర్‌లోకి వెళ్లాలని ఆయన నాకు చెప్పారు. కానీ నేను నిరాకరించాను. నాకు వీరమరణం సంభవించాల్సి వస్తే, ఇక్కడే చనిపోతా అని బదులిచ్చాను’’ అని జర్దారీ అన్నారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా శనివారం జరిగిన ఒక ర్యాలీలో జర్దారీ ఈ కామెంట్స్ చేశారు. తన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.పాకిస్తాన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన “శాంతిగా మీ ఆహారం తినండి, లేకపోతే నా బుల్లెట్స్ మీ కోసం వేచి ఉంటాయి” అనే హెచ్చరికకు జర్దారీ స్పందిస్తూ, బుల్లెట్లు పేల్చేది పాకిస్తానే అని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కన్నా 10 రెట్లు పెద్దది కావచ్చు, అయితే యుద్ధం చేయడానికి దానికి భారత్‌కు ధైర్యం లేదని ప్రగల్భాలు పలికారు.

ఈ ప్రకటనను చూస్తే భారత్ ఎంత తీవ్రంగా దాడులు చేసిందో అర్థమవుతుంది. దాడుల సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీతో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షరీఫ్ అంతా సేఫ్ హౌజుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 26 మంది పౌరుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాక్ వ్యాప్తంగా ఉన్న ఉగ్ర కార్యాలయాలపై భీకరదాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాక్ సైన్యం భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎయిర్ బేసుల్ని మన క్షిపణులు నాశనం చేశాయి. చివరకు మే 10న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణను వేడుకోవడంతో ఘర్షణ ముగిసిపోయింది.